మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపండి
విలీనం అయ్యే గ్రామాలకు కూడా పురపాలక శాఖ నుంచి లేఖ
సాక్షి, కుప్పం: కుప్పం మేజర్ పంచాయతీని నగర పంచాయతీ స్థాయికి పెంపుదలలో కదలిక వచ్చింది. పంచాయతీ స్థాయిని పెంచేందుకు వీలుగా ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతిపాదనలు పంపించాలని పురపాలక శాఖ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు అందాయి. మున్సిపాలిటీలతో పాటు ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈ నెలాఖరు లోపు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఊరింపే..
గత తెలుగుదేశం ప్రభుత్వంలో కుప్పం మేజర్ పంచాయతీని నగర పంచాయతీ (మున్సిపాలిటీ)గా మార్చే అంశం ప్రతిపాదనలకే పరిమితమైందే గానీ, కార్యరూపం దాల్చలేదు. ఆ దిశగా అప్పటి సీఎం, ప్రస్తుత విపక్ష నేత ఎన్.చంద్రబాబు కూడా శ్రద్ధ తీసుకున్నట్లు కనిపించలేదు.
సీఎం వైఎస్.జగన్ చొరవతో..
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. సీఎంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ కోవలోనే కుప్పంతో పాటు రాష్ట్రంలోని అనేక మేజర్ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరాల స్థాయిని పెంచే దిశగా అడుగులు వేశారు. ఆ క్రమంలోనే మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో కలిసి ఎన్నికలు నిర్వహించే విధంగా కొత్తగా మున్సిపాలిటీల ఏర్పాటుకు వీలుగా ప్రతిపాదనలు పంపించాలని ఈ నెల 17వ తేదీ పురపాలక శాఖ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యా యి. విలీనం చేయాల్సిన గ్రామాలు, పంచాయతీల వివరాలు కూడా పొందుపరచాలని అందులో సూచించారు.
కుప్పం మున్సిపాలిటీ స్వరూపం
కుప్పం మేజర్ పంచాయతీని నగర పంచాయతీగా పెంచడానికి గతంలో ప్రతిపాదనల మేరకు ఆ స్వరూపం ఇలా ఉండనుంది. కుప్పం నగర పంచాయతీలోకి సమీపంలోని ఎనిమిది పంచాయతీలు, గుడుపల్లె మండలంలోని మరో మూడు పంచాయతీలు విలీనం కానున్నాయి. కుప్పంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 22,303 మంది ఉన్నారు. పట్టణానికి చుట్టుపక్కల ఉన్న 11 పంచాయతీలు విలీనం చేస్తే ఆ సంఖ్య 49,574కు చేరుతుంది.