సాక్షి, ఉరవకొండ: కరోనా అనుమానిత లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన ఒక వ్యక్తి అంత్యక్రియలను ఉరవకొండ ఎస్ఐ ధరణి బాబు దగ్గరుండి జరిపించారు. వివరాలు ఇలా.. ఉరవకొండకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 15న రాత్రి జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే 108తో పాటు ఉరవకొండ ఎస్ఐ ధరణిబాబుకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంటనే స్పందించి అందుబాటులో ఉన్న ప్రైవేట్ అంబులెన్స్లో బాధితుడిని వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆ వ్యక్తి మృతిచెందాడు.
కరోనా అనుమానిత లక్షణాలతో మృతిచెందడంతో మృతదేహాన్ని ఉరవకొండకు తరలించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు తిరిగి ఎస్ఐ ధరణిబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేయించి మృతదేహాన్ని ఉరవకొండకు రప్పించుకోవడమే కాక, దగ్గరుండి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయినా వారందరూ ఉన్నా.. ఒక్కరూ ముందుకురాని విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలిచిన ఎస్ఐకు ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కరోనాతో సీఐ మృతి.. ఎంపీ మాధవ్ దిగ్భ్రాంతి