‘వెలుగు’లో చీకటి కోణం

3 Jan, 2015 01:45 IST|Sakshi

అనంతపురం సెంట్రల్ : జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ - వెలుగు ప్రాజెక్టులో మరో చీకటి కోణం బయటపడింది. నకిలీ స్వయం సహాయక సంఘాలను సృష్టించి ప్రభుత్వ నిధులను కొల్లగొట్టారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ తతంగం నడుస్తోంది. అధార్ అనుసంధానం చేయడంతో అక్రమాల లోగుట్టు కాస్త వెలుగులోకి వస్తోంది. మండల, క్షేత్ర స్థాయి అధికారులే ఇందులో ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 54 వేల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 5.60 లక్షల మంది సభ్యులున్నారు.

ప్రతి సంవత్సరం బ్యాంకుల నుంచి వందల కోట్లు రుణాలు మంజూరు చేస్తున్నారు. ఒక్క బ్యాంకు లింకేజీ ద్వారానే రూ. 600 కోట్లకు పైగా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తున్నారు. స్త్రీనిధి, ఇతర రుణాలు కలుపుకొని ప్రతి ఏటా మొత్తం వెయ్యి కోట్ల వరకూ రుణాలు మంజూరవుతున్నాయి. ఇటీవల రుణమాఫీ కోసం అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో రూ.995 కోట్లు ఎస్‌హెచ్‌జీలపై అప్పు నిల్వ ఉన్నట్లు తేల్చారు.

వ్యవసాయ ఆధారిత రుణాలు, పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు వెనుకంజ వేస్తారేమో కానీ స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయడానికి మాత్రం ఆలస్యం చేయలేదు. ప్రతి సంవత్సరం నిర్దేశించుకున్న లక్ష్యానికన్నా ఎక్కువ నిధులు మంజూరు చేసి అనేక మార్లు జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. దీన్నే ఆసరాగా చేసుకొని కొంత మంది మండల స్థాయి, క్షేత్రస్థాయి సిబ్బంది నకిలీ సంఘాలను సృష్టించారు.

సభ్యులు లేకున్నా నకిలీ పేరుతో సంఘాన్ని సృష్టించి ప్రభుత్వం, బ్యాంకులు మంజూరు చేసే రుణాలను తీసుకున్నారు. ప్రభుత్వ రాయితీలతో సొమ్ము చేసుకున్నారు. ఈ విషయం కాస్త గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆధార్ అనుసంధానం కార్యక్రమంలో బయటపడింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 శాతం ఆధార్ అనుసంధానం పూర్తయింది. మిగిలిన 20 శాతం పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు ఎంత గింజుకుంటున్నా ముందుకు కదలడం లేదు.

మరో పది, పదిహేను రోజుల్లో ఆధార్ అనుసంధానం కాని 20 శాతం సంఘాల్లో ఎంత మందికి ఆధార్ లేదు.. వలస వెళ్లిన వారు ఎంత మంది.. నకిలీ సంఘాల పేరుతో సొమ్ము చేసుకున్న సంఘాలు ఎన్ని అనే అంశాలను అధికారులు బహిర్గతం చేయనున్నారు. 10 శాతం సంఘాలు నకిలీవేనని ఇప్పటికే అధికారులు ఓ నిర్ధారణకు వస్తున్నారు.

ఇటీవల ఆధార్ అనుసంధానంపై ఉన్నతాధికారులు నిర్వహించిన సమీక్షలో సంబంధిత సెక్షన్ ఆధికారి.. నకిలీ సంఘాలు ఉండడం ద్వారా అధార్ అనుసంధానంలో వెనుకబడ్డామని అధికారులకు వివరణ ఇచ్చారు. దీంతో నకిలీ సంఘాల విషయం బయటపడింది. కాగా, కొంత మంది అధికారులే నకిలీ సంఘాలను సృష్టించారనే అరోపణలు వస్తుండడంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
 
నకిలీ సంఘాలు వాస్తవమే : మల్లీశ్వరిదేవి, ఇన్‌చార్జ్ పీడీ, డీఆర్‌డీఏ-వెలుగు ప్రాజెక్టు
 జిల్లాలో నకిలీ స్వయం సహాయక సంఘాలు ఉన్న మాట వాస్తవమే. వీటిని నిర్మూలించేందుకే ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రస్తుతం మిగిలిపోయిన వారంతా నకిలీ అని చెప్పలేం. ఇందులో కొంత మందికి ఆధార్ ఉండకపోవచ్చు. త్వరలో ఎన్ని సంఘాలు నకిలీవి ఉన్నాయనే విషయం బయటపడుతుంది.

మరిన్ని వార్తలు