జ్వరం..కలవరం

7 Sep, 2018 11:40 IST|Sakshi
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో రోగులు

జిల్లాలో పెరుగుతున్న జ్వర బాధితులు

వాతావరణ మార్పులతో  వైరల్‌ వ్యాధులు

రుయా ఆస్పత్రికి రోగుల తాకిడి

వైద్య ఆరోగ్య శాఖ స్పందన అంతంతమాత్రం

మునుపెన్నడూ లేనంతగా సెప్టెంబరు తొలి వారంలోనూ ఎండలు మండుతున్నాయి. అప్పుడప్పుడు పలకరింపుగా వరుణడు ప్రత్యక్షమవుతున్నాడు. అడపాదడపా జల్లులు కురిపిస్తున్నాడు. ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులు జ్వరాలకు కారణమవుతున్నాయి. జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య రాన్రానూ పెరుగుతోంది. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి ప్రధానాస్పత్రుల్లో జ్వరపీడితులు పెరుగుతున్నారు.

చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : రాయలసీమ ప్రాంత పెద్దాస్పత్రి  రుయాలో వైరల్‌ ఫీవర్‌తో రోజుకు 250 మందికి పైగా జనరల్‌ మెడిసిన్‌ ఓపీ విభాగానికి వస్తున్నారు. నిత్యం ఓపీ రద్దీగానే కనిపిస్తోంది.  సీజనల్‌ వ్యాధులకు  అవసరమైన మందులపై వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదు. కొంత కాలంగా అడపాదడపా చిన్నపాటి వర్షం  కురుస్తోంది. వెంటనే ఎండ దంచేస్తోంది. దీంతో ప్రజలు వ్యాధులతో సతమతమవుతున్నారు. రుయా ఓపీకి రోజూ 1,500 నుంచి 2వేల మంది వస్తుంటారు. వీరిలో తీవ్రమైన జ్వరంతో వస్తున్న వారు 250 మందికిపైగా ఉన్నారు. రక్త పరీ క్షల కోసం సెంట్రల్‌ ల్యాబ్‌ ముందు రోగులు గంటల తరబడి నిరీక్షించా ల్సిన దుస్థితి నెలకుంది.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో..
తిరుపతిలోని కార్పొరేట్‌ ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నగరంలో పేరు పొందిన 20 ఆస్పత్రుల్లో జ్వరంతో రోగులతాకిడి పెరిగింది. డెంగ్యూ, మలేరియా కేసులు నమోదైనట్లు సమాచారం.  చిన్నపిల్లల ఆస్పత్రిలో జ్వరంతో వస్తున్న చిన్నారులసంఖ్య పెరుగుతోంది. పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లే వారికి రక్త పరీక్షల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారని రోగులు గగ్గోలు పెడుతున్నారు. సీజనల్‌ మార్పులకు అనుగుణంగా వచ్చే రోగాలపై  వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మదనపల్లెలో రోగాల దాడి
మదనపల్లె మున్సిపాలిటీతో పాటు పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు విషజ్వరాల బారిన పడి అల్లాడిపోతున్నారు. మలేరియా, టైఫాయిడ్, తదితర విషజ్వరాలతో ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్పత్రులు రోగులతో కనిపిస్తున్నాయి. మదనపల్లె జిల్లా, íపీహెచ్‌సీ( ప్రాథమిక వైద్యకేంద్రాల)ల పరిస్థితి దారుణంగా మారింది. జిల్లా ఆస్పత్రితో పాటు, రూరల్‌ పరిధిలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఉంది. డాక్టర్లు, ఎఫ్‌ఎన్‌ఓలు, ఎంఎన్‌ఓలతో పాటు  ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్టులు, ఫీల్డు అసిస్టెం ట్లు, అటెండర్లు, యూడిసి, సీనియర్‌ అసిస్టెంటుల పోస్టులు 81కి గానూ 39కిపైగా ఖాళీగా ఉన్నాయి.  సిబ్బంది  లేకపోవడంతో ప్రజలు ఆస్పత్రుల నుంచి వెనుతిరగాల్చి వస్తోంది. ఉదయం 9  నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీలో డాక్టర్లు అందుబాటులో ఉండాలి. కానీ వారు 10.30కి వచ్చి 12 గంటలకే వెళ్లిపోతున్నారు.  

పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లలో డాక్టర్లు వారానికి రెండు మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు.  ఇప్పటి వరకు డెంగీ, మలేరియా, విషజ్వరాలతో నలుగురు చనిపోయారనే సమాచారం ఉంది. ఆరు నెలల వ్యవధిలో 1017 మంది విషజ్వరాల బారిన పడ్డారు.

మెరుగైన సేవలందిస్తున్నాం
తీవ్రమైన జ్వరంతో రుయాకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. అత్యవసర విభాగంలో 24 గంటల ల్యాబ్‌తో పాటు సెంట్రల్‌ ల్యాబ్‌ను కూడా అందుబాటులో ఉంచాం. జ్వర బాధితులకు వేగవంతంగా రక్త పరీక్షలు నిర్వహించేలా ఇప్పటికే టెక్నీషియన్లకు ఆదేశాలు జారీ చేశాం.– డాక్టర్‌ సిద్ధానాయక్, సూపరింటెండెంట్, రుయా ఆస్పత్రి, తిరుపతి

మరిన్ని వార్తలు