వీఆర్‌ఓ మల్లారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

16 Aug, 2019 10:47 IST|Sakshi
టీడీపీ కండువాతో వీఆర్‌ఓ మల్లారెడ్డి   

సాక్షి, డోన్‌/కర్నూలు: ప్యాపిలి మండలం జలదుర్గం వీఆర్‌ఓగా పని చేసి బదిలీపై వెళ్లిన మల్లారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ వీఆర్‌ఓ మల్లారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అవుకు మండలం మెట్టుపల్లి వీఆర్‌ఓగా పనిచేస్తున్న మల్లారెడ్డి స్వగ్రామం ప్యాపిలి మండలం గార్లదిన్నె. గత ప్రభుత్వ హయాంలో అతడు ప్రభుత్వ ఉద్యోగినన్న సంగతి మరచిపోయి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో ఏకంగా టీడీపీ డోన్‌ నియోజకవర్గ అభ్యర్థి కేఈ ప్రతాప్‌తో కలసి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నాడు. దీంతో అతడిపై అప్పట్లో ‘సాక్షి’లో కథనాలు కూడా వెలువడ్డాయి. వైఎస్సార్‌ సీపీ నాయకులు సైతం వీఆర్‌ఓ తీరుపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు వీఆర్‌ఓ మల్లారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు