భర్త ఇంటి ఎదుట భార్య దీక్ష

8 Feb, 2019 13:49 IST|Sakshi
భర్త ఇంటి ముందు దీక్షకు కూర్చున్న రాములమ్మ

కర్నూలు, ఎమ్మిగనూరురూరల్‌: పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీలో భర్త ఇంటి ముందు భార్య దీక్షకు కూర్చున్న సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలు రాములమ్మ మాట్లాడుతూ మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామానికి చెందిన దివ్యాంగురాలు దళిత రాములమ్మ ఎమ్మిగనూరులో డిగ్రీ చదివే సమయంలో పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్‌ పద్మశాలి వీరేష్‌తో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. దీంతో 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

అయితే రాములమ్మకు తెలియకుండా కోసిగికి చెందిన లక్ష్మిని వీరేష్‌ వివాహం చేసుకున్నాడు. ఎలాగైనా తనను వదలించుకోవాలని వీరేష్‌ వేధించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా ఇంట్లో నుంచి బయటకు పంపాడు. దీంతో రాములమ్మ గతేడాది డిసెంబర్‌లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో బాగా చూసుకుంటానని ఇంట్లోకి పిలుచుకున్నాడు. మూడు రోజుల క్రితం దివ్యాంగ పింఛన్‌ తీసుకొచ్చాక డబ్బులు తీసుకొని ఇంటి నుంచి గెంటివేశాడని రాములమ్మ వాపోయింది. ఆరు నెలల పసిబిడ్డ ఉందని వేడుకున్నా వెళ్లగొట్టాడని, రెండు రోజుల పాటు బంధువుల ఇంట్లో తలదాచుకున్నానని కన్నీరు పెట్టుకుంది. సాయంత్రం ఇంటికి వస్తే తాళం వేసి ఉందని, తనను ఇంట్లోకి పిలుచుకునే వరకు ఇక్కడే కూర్చుంటానని భీష్మించుకుంది.

మరిన్ని వార్తలు