అయిదు నిమిషాల్లోనే..

16 Dec, 2013 02:22 IST|Sakshi

ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్:  జనన, మరణ సర్టిఫికెట్ పొందాలంటే ఇక నెలల తరబడి మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి సారిగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ జనన, మరణ ధ్రువీకరణ దరఖాస్తులను కంప్యూటరీకరణ చేస్తోంది. అడిగిన అయిదు నిమిషాలకే ధ్రువీకరణ పత్రం ఇచ్చే విధంగా మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ చర్యలు చేపట్టారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లో జనన, మరణ ధ్రువీకరణ పత్రం అడిగిన అయిదు నిమిషాలకే ఇచ్చే విధంగా కంప్యూటరీకరణ చేస్తున్నారు.
 
 గత మూడు నెలల నుంచి కొనసాగుతున్న కంప్యూటరీకరణతో ఇప్పటి దాకా 1 లక్షా, 30 వేల మంది వివరాలను కంప్యూటర్‌లో పొందుపరిచారు. 1915 నుంచి ప్రస్తుత తేదీ దాకా కంప్యూటరీకరణ చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. ఇందులో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక బ్యాచ్, తిరిగి రాత్రి నుంచి ఉదయం వరకు మరో బ్యాచ్ ఆపరేటర్లు కంప్యూటరీకరణ చేస్తున్నారు.
 
 డిసెంబర్ నెలాఖరులోగా కంప్యూటరీకరణ పూర్తి...
 డిసెంబర్ నెలాఖరులోగా కంప్యూటరీకరణ పూర్తి చేయనున్నారు. అనంతరం ఏరోజుకారోజు కంప్యూటర్‌లో పొందుపరిచే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ప్రజారోగ్యశాఖలో పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతోంది.  ఇప్పటి దాకా కంప్యూటర్ ఆపరేటర్లు లక్షా 30 వేల మంది వివరాలను కంప్యూటర్‌లో పొందుపరచగా అందులో 10,559 మంది వివరాలు అప్‌గ్రేడ్ అయ్యాయి. అప్‌గ్రేడ్ అయిన వారికి సంబంధించి అరగంటలోపే జనన, మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందులో 1980 సంవత్సరంలో 2225 మంది వివరాలు, 1982లో 2028, 1984లో 803, 1986లో 1464, 1987లో 1172, 1989లో 33, 1990లో 824, 1991లో 934, 1992లో 1076 అప్‌గ్రేడ్ అయ్యాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు.
 

మరిన్ని వార్తలు