వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జ‌గ‌న్ విస్తృత ప‌ర్య‌ట‌న

3 Feb, 2017 18:38 IST|Sakshi

పులివెందుల(వైఎస్ఆర్ జిల్లా) :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం వైఎస్ఆర్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌ల్లో భాగంగా దేవుని కడ‌ప‌లో నిర్వ‌హించిన వెంక‌టేశ్వ‌ర‌స్వామి ర‌థోత్స‌వంలో వైఎస్ జ‌గ‌న్ పాల్గొన్నారు. ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఆల‌య క‌మిటీ స‌భ్యులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఉత్స‌వ మూర్తి ద‌ర్శ‌నం అనంతరం వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ..ర‌థోత్స‌వంలో పాల్గొన‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

అదేవిధంగా పులివెందుల‌లో సైదాపురం ఓబుల్‌రెడ్డి కుమార్తె వివాహ వేడుక‌ల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. అనంత‌రం అల‌మ‌ల‌పాడు వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి కుమారుడి వివాహ వేడుక‌ల్లో పాల్గొని నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు. అక్క‌డి నుంచి ఆయ‌న వ్య‌క్తిగ‌త పీఏ ర‌విశేఖ‌ర్ ఇంటికి వెళ్లారు. ఇటీవ‌ల ర‌విశేఖ‌ర్ భార్య మృతి చెందడంతో వైఎస్ జ‌గ‌న్ ర‌విశేఖ‌ర్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. బంధువుల‌కు ధైర్యం చెప్పారు.


రాష్ట్రంలో అవినీతి రాజ‌కీయాల‌ను త‌రిమికొడ‌దామ‌ని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు పిలుపునిచ్చారు. పులివెందుల‌లో శుక్ర‌వారం వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స‌భ్యుల‌తో వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం నిర్వ‌హించారు. త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థి గెలుపున‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ప్ర‌జాప్ర‌తినిధుల‌కు వైఎస్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. స‌మావేశంలో ఎమ్మెల్యేలు గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి, కొర‌ముట్ల శ్రీ‌నివాసులు, రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, ర‌ఘురామిరెడ్డి, ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, అంజ‌ద్‌బాషా, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి, మేయ‌ర్ సురేష్‌బాబు, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు అమ‌ర్‌నాథ్‌రెడ్డి తదిత‌రులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు