తిరుపతి : ఆంధ్రప్రదేశ్ మంత్రులకు జగన్ ఫోబియా పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఢిల్లీ పర్యటనను అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన గురువారమిక్కడ మండిపడ్డారు. రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి మద్దతిస్తామని వైఎస్ జగన్ చెప్పారు కానీ, బీజేపీతో కలుస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే జగన్పై మంత్రులు బురద జల్లుతున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. మంత్రి నారాయణ కుటుంబాన్ని పరామర్శించకుండా, జగన్పై విమర్శలకే సమయం కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు.
వాళ్లకు ఆ స్థాయి లేదు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన వైఎస్ జగన్పై విమర్శలు చేసే స్థాయి మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడుకు లేదని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్...ప్రధానిని కలిస్తే టీడీపీ ఎందుకు కంగారు పడుతోందని ఆయన ప్రశ్నించారు. దేశానికి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుందన్న జగన్ మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు. ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతి కావడం టీడీపీకి ఇష్టం లేనట్లు ఉందని బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు.