టీడీపీ పాలనలో దళితులను నిర్లక్ష్యం చేశారు

16 Dec, 2019 14:11 IST|Sakshi

శాసనసభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లపై చర్చ జరుగుతుంటే టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మడకశిర వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మండిపడ్డారు. సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. 70 ఏళ్ల తర్వాత ఆశించిన రీతిలో దళితుల అభివృద్ధి జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపే వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దళితులకు కేబినెట్‌లో పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటేడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్ష ణీయన్నారు.

అందుకే గట్టిగా బుద్ధి చెప్పారు..
చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీలను ఏవిధంగానూ అభివృద్ధి చేయలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. అందుకే ఎన్నికల్లో ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. టీడీపీ పాలనలో దళితులను నిర్లక్ష్యం చేశారని నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తుంగలో తొక్కారన్నారు. ఎస్సీ, ఎస్టీలను ఉద్దరించానని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెబుతున్నారని, ఎలాంటి అన్యాయం జరిగిందో అందరికి తెలుసునన్నారు.

ఆ ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది..
ఎస్సీ,ఎస్టీలను ఉద్ధరించామని టీడీపీ వాళ్లు చెబుతున్నారని.. దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని మాట్లాడింది చంద్రబాబేనని  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ఎస్టీ లేని కేబినెట్‌ ఏదైనా ఉందంటే..చంద్రబాబు హయాంలోనేనన్నారు. దళితులు పడుతున్న బాధలు చూసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చట్టాలు చేస్తున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

దాడులు జరిగితే ఆయన మాట్లాడలేదు..
దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు మాట్లాడలేదని ఎమ్మెల్యే  కంబాల జోగులు అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను స్వాగతిస్తున్నామన్నారు. టీడీపీ పాలనలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయన్నారు.

ఏపీ చరిత్రలో నూతన అధ్యాయం..
ఎస్సీ,ఎస్టీ, కమిషన్‌ విభజన ఏపీ చరిత్రలో నూతన అధ్యాయం అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూ అన్నారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ విభజన వల్ల న్యాయం వేగంగా జరుగుతుందన్నారు. టీడీపీ పాలనలో ఎస్సీ,ఎస్టీలు ఎన్నో అవమానాలకు గురయ్యారన్నారు. వైఎస్సార్‌ హయాంలో దళితులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. దళితుల కోసం సీఎం జగన్‌ అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను హీనంగా చూశారన్నారు.

మరిన్ని వార్తలు