ప్రజా బ్యాలెట్‌లో చంద్రబాబు చిత్తు

9 Sep, 2018 13:08 IST|Sakshi

రానున్నది రాజన్న రాజ్యమే 

భూమన కరుణాకర రెడ్డి 

తిరుపతి సెంట్రల్‌ : వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఎస్టీవీ నగర్‌ వద్ద శనివారం వైఎస్సార్‌సీపీ ప్రజా బ్యాలెట్‌ నిర్వహించింది. అధిక సంఖ్యాకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను ఇందులో వెల్లడించారు. ప్రజా వ్యతిరేకత స్పష్టమైంది. ప్రజా బ్యాలెట్‌ను పర్యవేక్షించిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటిని ఎండగట్టారు.

తమను నిలువునా మోసం చేసిన చంద్రబాబు నాయుడు వైఖరిని ప్రజలు గ్రహించారన్నారు. ఈ సారి ఎన్నికలో టీడీపీకి గుణపాఠం చెబుతారన్నారు. ప్రజా వ్యతిరేకతలో చంద్రబాబు ప్రభుత్వం కొట్టుకుపోతుందని తాము నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌లో తేలిపోయిందని స్పష్టం చేశారు. దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి తరహాలోనే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన అందిస్తారని పేర్కొన్నారు. ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపు నిచ్చారు. సీఎం చంద్రబాబును ప్రజలెవరూ విశ్వసించే పరిస్థితి లేదని పార్టీ నాయకులు ఎస్‌కే బాబు, కోటూరి ఆంజినేయులు అన్నారు. 

  ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ప్రజా బ్యాలెట్‌లో పాల్గొన్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దుద్దేల బాబు, ఎంవీఎస్‌ మణి, సాకం ప్రభాకర్, కేతం జయచంద్రారెడ్డి, తలారి రాజేంద్ర, కట్టా గోపీయాదవ్, వాసుయాదవ్, ఆరె అజయ్‌కుమార్, నల్లాని బాబు, తిరుమలయ్య, పైడి చంద్రశేఖర్‌ రాయల్, జీవరత్నం, కోబాకు ధనుంజయ రెడ్డి,  మబ్బు నాధముని రెడ్డి, మాకం చంద్ర, కొత్తపాటి మనోహర్‌ రెడ్డి, మాధవ నాయుడు, జీవీ కుమార్‌ రాయల్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారిలా..
చంద్రబాబు పాలనపై  తిరుపతిలోని ఎస్టీవీ నగర్‌లో వెఎస్సార్‌సీపీ శనివారం ప్రజాబ్యాలెట్‌ నిర్వహించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్‌కే బాబు, ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు కోటూరి ఆంజినేయులు సారథ్యం వహించారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణమైన హామీలు అమలు చేశారా లేదా అనే ఆరు అంశాలపై బ్యాలెట్‌ను రూపొందిం చారు. నిర్ణీత సమయం ముగిసే సరికి 900 మంది పాల్గొన్నట్టు ఎస్‌కే బాబు తెలిపారు. 831 మంది చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా, 69 మంది అనుకూలంగా ఓటు వేశారని చెప్పారు. 

>
మరిన్ని వార్తలు