‘డొనేట్‌కార్ట్‌’కు రూ.2.55 కోట్ల సీడ్‌ ఫండ్‌ 

7 Mar, 2019 01:29 IST|Sakshi

లెట్స్‌ వెంచర్, ఏంజెల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడి

రాయదుర్గం: ఆన్‌లైన్‌ డొనేషన్‌ ప్లాట్‌ఫామ్‌గా టీ–హబ్‌లో ఊపిరి పోసుకున్న ‘డొనేట్‌కార్ట్‌’కు రూ.2.55 కోట్ల సీడ్‌ ఫండింగ్‌ లభించింది.  లెట్స్‌ వెంచర్, ఇతర ఏంజెల్‌ ఇన్వెస్టర్ల ద్వారా ఈ సీడ్‌ ఫండింగ్‌ లభించినట్లు డొనేట్‌కార్ట్‌ వ్యవస్థాపకులు అనిల్‌ కుమార్‌రెడ్డి, సందీప్‌ శర్మ చెప్పారు. ఈ నిధులతో టెక్నాలజీని, టీమ్‌ను మరింత మెరుగుపర్చుకుంటామని వారు చెప్పారు. వీరిద్దరూ ఎన్‌ఐటి నాగ్‌పూర్‌లో చదువుకుని, 2016లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

చెన్నయ్‌లో వరదల సందర్భంగా నెల రోజులపాటు వలంటీర్‌గా పనిచేయటం ఈ స్టార్టప్‌ దిశగా తమను ప్రేరేపించిందని వారు చెప్పారు. డొనేట్‌కార్ట్‌ సంస్థ గడిచిన రెండున్నరేళ్లలో 30వేల మంది నుంచి రూ.5 కోట్ల విరాళాలను సేకరించింది. వాటిని 500 స్వచ్ఛంద సంస్థల ద్వారా అవసరార్థులకు పంపిణీ చేసింది. వచ్చే మూడేళ్ళలో రూ.100 కోట్ల విరాళాలను సేకరించి, అవసరార్థులకు అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అనిల్‌ కుమార్‌ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.     

మరిన్ని వార్తలు