వైద్య వ్యయాల తగ్గింపుపై కేంద్రం దృష్టి!

22 Jan, 2019 01:07 IST|Sakshi

కొన్ని వైద్య పరికరాలపై  కస్టమ్స్‌ సుంకం కోత?

బడ్జెట్‌ ప్రతిపాదనలకు కేంద్రం కసరత్తు 

న్యూఢిల్లీ: రోగులకు వైద్య వ్యయాల తగ్గింపు లక్ష్యంగా రానున్న వార్షిక బడ్జెట్‌పై కసరత్తు జరుగుతోందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కొన్ని వైద్య పరికరాలపై దిగుమతి సుంకాల తగ్గింపును కేంద్రం పరిశీలిస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. ముక్కుకు సంబంధించి ఆపరేషన్‌లో వినియోగించే పీడీఎస్‌ ప్లేట్స్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని ప్రస్తుత 10 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలని ఇండస్ట్రీ చాంబర్‌ సీఐఐ తన బడ్జెట్‌ ముందస్తు మెమోరాండంలో ప్రభుత్వాన్ని కోరింది. వెన్నుముక పరికరాలు, జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ పరికరాలపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించాలని కూడా సీఐఐ కేంద్రాన్ని కోరింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇది ఓట్‌–ఆన్‌–అకౌంట్‌ బడ్జెట్‌గా ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. 

ఇప్పటికే పలు చర్యలు..
దేశంలో వైద్య పరికరాల తయారీకి ఊపునివ్వడం, ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణ, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో ఎగుమతులకు ప్రోత్సాహం వంటి లక్ష్యాల సాధనకు కేంద్రం ఇటీవల నేషనల్‌ మెడికల్‌ డివైజెస్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎండీపీసీ)ను నెలకొల్పింది. ఫార్మా రంగం విషయంలో భారత్‌ ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే వైద్య పరికరాల పరిశ్రమ విషయంలో మాత్రం అంత పురోగతి సాధించలేదు. ఈ అంశంపైనా దృష్టి పెట్టిన కేంద్రం,  ఈ విభాగంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులూ లేకుండా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది.   

మరిన్ని వార్తలు