భారత్ ప్రపంచకప్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తామన్న సీఈఓ

18 Nov, 2023 20:38 IST|Sakshi

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే ఏకంగా రూ.100 కోట్లు ఇస్తానని ఆస్ట్రోటాక్ సీఈఓ పునీత్ గుప్తా ప్రకటించారు. ఆస్ట్రోటాక్ వినియోగదారులకు ఈ డబ్బును పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తన లింక్డ్‌ఇన్‌ ఖాతాలో కొన్ని విషయాలను పంచుకున్నారు. 

‘భారత్‌ చివరిసారి 2011లో ప్రపంచకప్ గెలిచినప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను. అవి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజులు. చండీగఢ్‌లోని కళాశాల సమీపంలో ఉన్న ఆడిటోరియంలో నా స్నేహితులతో కలిసి ఆ మ్యాచ్‌ని చూశాను. ఆ సమయంలో రోజంతా చాలా టెన్షన్‌గా ఉన్నాం. మ్యాచ్ జరిగే ముందురోజు గెలుపోటములపై చర్చించాం. దాంతో సరిగా నిద్రపోలేదు. ఆరోజు విజయాన్ని పంచుకునేందుకు నాకు కొందరు స్నేహితులు ఉండేవారు. ఈసారి ఇండియా విజయాన్ని పంచుకునేందకు చాలా మంది ఆస్ట్రోటాక్ వినియోగదారులు ఉన్నారు. అందరూ ఇండియా గెలవాలని ప్రార్థించాలి’ అని తెలిపారు. 

ఇదీ చదవండి: అక్కడ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ రోజున ఉచిత వసతి!

‘టీం ఇండియా ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిస్తే నా ఆనందాన్ని పంచుకోవడానికి ఏదైనా చేయాలి. కాబట్టి, ఈరోజు నా ఫైనాన్స్ టీమ్ సభ్యులతో చర్చించాను. భారత్‌ కప్ గెలిస్తే మా వినియోగదారులకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తాను’అని చెప్పారు.

మరిన్ని వార్తలు