ముంబై : ఆర్థిక సర్వే వృద్ధి అంచనాలు ఆశావహంగా ఉండటంతో రికార్డు ర్యాలీ కొనసాగించిన స్టాక్మార్కెట్లకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్లో నష్టాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్ 36,200 కిందకి పడిపోయింది. నిఫ్టీ సైతం కీలకమార్కు 11,100 కిందకి దిగజారింది. ప్రస్తుతం సెన్సెక్స్ 75 పాయింట్ల నష్టంలో 36,208 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల నష్టంలో 11,093 వద్ద కొనసాగుతున్నాయి. టెక్నాలజీ, ఎంపిక చేసిన ప్రైవేట్ బ్యాంకులు, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో, మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ప్రారంభ ట్రేడింగ్లో టాప్ లూజర్లుగా టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, వేదాంతా షేర్లు నష్టాలు గడించాయి.
అయితే క్యూ3లో ఆర్కామ్ తన నష్టాలను 95 శాతం తగ్గించుకోవడంతో, ఆ కంపెనీ షేర్లు లాభాల పంట పండిస్తున్నాయి. ఆర్కామ్ షేర్లు నేటి ట్రేడింగ్ ప్రారంభంలో 5.5 శాతం పైగా లాభపడ్డాయి. ఆర్కామ్తో పాటు బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఇండియాబుల్స్ హౌజింగ్, గెయిల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, హెచ్పీసీఎల్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. నిఫ్టీ మిడ్క్యాప్ మరో అరశాతం పడిపోయింది. నిన్నటి ట్రేడింగ్లోనే 0.85 శాతం నష్టాలు పాలైంది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ భారీగా 13 పైసలు నష్టపోయి 63.67 వద్ద ఉంది.