ఎన్‌డీటీవీపై రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కేసు

20 Oct, 2018 01:12 IST|Sakshi

రూ.10 వేల కోట్లకు పరువునష్టం దావా

చట్టపరంగా ఎదుర్కొంటాం: ఎన్‌డీటీవీ  

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇతరులు కలిసి తమకు వ్యతిరేకంగా రూ.10 వేల కోట్లకు పరువు నష్టం దావాను దాఖలు చేసినట్లు ఎన్‌డీటీవీ వార్తా సంస్థ తెలియజేసింది. అహ్మదాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో ఇది దాఖలైందని, ఈ మేరకు అక్కడి నుంచి తమకు ఈ నెల 18న నోటీసులు అందాయని ఈ సంస్థ తెలిపింది. కంపెనీతోపాటు, ఎగ్జిక్యూటివ్‌ కో చైర్‌పర్సన్, మేనేజింగ్‌ ఎడిటర్‌లను బాధ్యులను చేస్తూ ఈ వ్యాజ్యం దాఖలైనట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు వెల్లడించింది.

ఈ వ్యవహారాన్ని కోర్టులో ఎదుర్కొంటామని పేర్కొంది. ‘‘ప్రతీ వారం నిర్వహించే ‘ట్రూత్‌ వర్సెస్‌ హైప్‌ (వాస్తవం/కల్పితం)’ షోలో భాగంగా సెప్టెంబర్‌ 29న ప్రసారం చేసిన ‘ఐడియల్‌ పార్ట్‌నర్‌ ఇన్‌ రఫేల్‌ డీల్‌ (రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో సరైన భాగస్వామి)’ కథనానికి సంబంధించి ఈ వ్యాజ్యం దాఖలైనట్టు ఎన్‌డీటీవీ తెలిపింది. ఆరోపణలను తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని, ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు సమర్పిస్తామని సంస్థ తెలిపింది. ఈ వ్యాజ్యం ఈ నెల 26న విచారణకు రానుంది.

మరిన్ని వార్తలు