ఆర్‌బీఐ పాలసీ : భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

5 Apr, 2018 10:03 IST|Sakshi
భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు (ఫైల్‌ ఫోటో)

ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పాలసీ ప్రకటనకు ముందు దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా, చైనాల మధ్య సుంకాల యుద్ధం మరో స్థాయికి చేరడంతో నిన్న భారీగా పతనమైన ప్రపంచ మార్కెట్లు, నేటి ట్రేడింగ్‌లో కోలుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కూడా గ్లోబల్‌ మార్కెట్లకు అనుగుణంగా భారీగా లాభపడుతున్నాయి. ప్రారంభంలో 350 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌, ప్రస్తుతం 347 పాయింట్ల లాభంలో 33,366 వద్ద, నిఫ్టీ 111 పాయింట్ల లాభంలో 10,239 వద్ద ట్రేడవుతున్నాయి. నేటి ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే నడుస్తున్నాయి. 

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ప్రారంభంలో 1.6 శాతం ర్యాలీ జరిపింది. నిఫ్టీ ఐటీ 1.3 శాతం, పీఎస్‌యూ బ్యాంకు 1.6 శాతం లాభపడ్డాయి. మెటల్‌, రియాల్టీ అయితే ఏకంగా 2 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు నేడు మధ్యాహ్నం ఆర్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరపు తొలి ద్వైమాసిక పరపతి సమీక్షను ప్రకటించనుంది. రెండు రోజుల నేపథ్యంలో మానిటరీ పాలసీ కమిటీ నిన్న(బుధవారం) భేటీ అయింది. ప్రారంభంలో టాటా స్టీల్‌, యూపీఎల్‌, యస్‌ బ్యాంకు, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, ఐషర్‌ మోటార్స్‌, అదానీ పవర్‌, కొటక్‌ మహింద్రా బ్యాంకు, ఎల్‌ అండ్‌ టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఐటీసీ, ఎస్‌బీఐ 3 శాతం వరకు లాభపడ్డాయి.  

మరిన్ని వార్తలు