ఎస్సార్‌ స్టీల్‌: అప్పులు చెల్లించాకే బిడ్‌

4 Oct, 2018 12:24 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రుణ సంక్షోభంతో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న ఉక్కు సంస్థ ఎస్సార్ స్టీల్‌ను దక్కించుకునే రేసులో ఉన్న బిడ్డర్లు ఆర్సెలర్‌ మిట్టల్, నూమెటల్‌కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఇరు కంపెనీల బిడ్స్‌ చెల్లుతాయన్న కోర్టు నుమెటల్‌కు భారీ ఊరట నిచ్చింది. దీనిపై సీవోసీ (కమిటీ ఆఫ​ క్రెడిటర్స్‌) అంగీకరించిన తరువాత మాత్రమే ఎన్‌సీఎల్‌టీ, ఎన్‌సీఎల్‌ఏటీ జోక్యం చేసుకుంటాయని తెలిపింది.  మెజారిటీ (66శాతం) సీవోసీ సభ్యులు ఈ  ప్రక్రియకు అంగీకరించాలనీ, లేదంటే లిక్విడేషన్‌కు వెళుతుందని సుప్రీం స్పష్టం చేసింది.

అయితే ఈ వేలానికి ముందు రెండు వారాలలో బకాయిలను క్లియర్ చేయాలని  ఇరు సంస్థలను సుప్రీం కోర్టు ఆదేశించింది.  రోహిన్టన్ నారిమన్,  ఇందుహల్హోత్రా నేతృత్వంలోని  సుప్రీంకోర్టు బెంచ్ ఈ ఆదేశాల్చింది. అలాగే ఈ రెండు కంపెనీల బిడ్లపై  ఎస్సార్‌ స్టీల్‌  రుణదాతల కమిటీ నిర్ణయం తీసుకోవాలని, ఎనిమిది వారాల్లో అత్యుత్తమ బిడ్‌ను ఎంపిక చేయాలని సూచించింది.  అంతేకాక 270 రోజుల్లో  దివాలా ప్రక్రియ గడువు  పూర్తి కావాలని తెలిపింది.

ఆర్సెలార్‌ మిట్టల్‌ తన అనుబంధ విభాగమైన ఉత్తమ్‌ గాల్వాకు బకాయిపడిన మొత్తం  రూ.7,000 కోట్లు. దీంతో ఉత్తమ్‌ గాల్వా రుణదాతలకు బకాయిలు చెల్లించేందుకు ఆర్సెలార్‌ మిట్టల్‌ ఇప్పటికే రూ.7 వేల కోట్లను తన ఎస్ర్కో ఖాతాలో డిపాజిట్‌ చేసింది. దివాలా కోడ్‌లోని సెక్షన్‌ 29ఎ ప్రకారం.. బకాయి పడిన కంపెనీలకు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హత లేదు. మొత్తం 30 బ్యాంకులు, ఇతర రుణదాతలకు ఎస్సార్‌ స్టీల్‌ రూ.49,000 కోట్లు బకాయి పడటంతో సంస్థపై దివాలా పరిష్కార చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే దివాలా పరిష్కారానికి చేరువవుతున్న నేపథ్యంలో సంస్థ బకాయిలను ఆస్తుల పునర్వ్యవస్థీకరణ సంస్థల(ఎఆర్‌సి)కు విక్రయించాలన్న ప్రతిపాదనను ఎస్‌బిఐ ఉపసంహరించుకుంది. ఎస్‌బిఐకి ఎస్సార్‌ స్టీల్‌ రూ.13,000 బకాయిపడింది.

మరిన్ని వార్తలు