Delhi: నీరుగారిన నిషేధం: పేలిన టపాసులు, ఎగిరిన తారాజువ్వలు!

13 Nov, 2023 06:55 IST|Sakshi

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్య నియంత్రణకు సుప్రీంకోర్టు బాణాసంచాపై నిషేధం విధించింది. అయితే ఢిల్లీవాసులు ‘సుప్రీం’ ఆదేశాలను ధిక్కరించి, యధేచ్ఛగా బాణాసంచా వెలిగించారు. దీపావళి రోజు రాత్రి జనమంతా టపాసులు కాల్చడంతో ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఫలితంగా నగరం అంతటా విపరీతమైన కాలుష్యం ఏర్పడింది. 

ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో వెలిగించిన బాణసంచా కారణంగా దట్టమైన పొగ కమ్ముకుని, విజిబులిటీ గణనీయంగా తగ్గిపోయింది. కాస్త దూరం ఉన్న దృశ్యాలను చూడటం కూడా కష్టతరంగా మారింది. సోషల్ మీడియాలోని వివిధ సైట్‌లలో షేర్ అవుతున్న తాజా పోస్ట్‌లను పరిశీలిస్తే పెద్ద సంఖ్యలో ప్రజలు టపాసులు కాల్చినట్లు తెలుస్తోంది. 

ఆదివారం రాత్రి లోధీ రోడ్, ఆర్‌కె పురం, కరోల్ బాగ్, పంజాబీ బాగ్‌లకు సంబంధించిన ఫొటోల్లో బాణాసంచా వెలుగులు, ఆకాశాన్ని కాంతులతో ముంచేసిన దృశ్యాలు కనిపించాయి. గత కొన్ని వారాలుగా దేశ రాజధాని కాలుష్యంతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కాలుష్యం చాలాచోట్ల ‘తీవ్రమైన’ కేటగిరీలో ఉంది. దీపావళి తర్వాత దేశ రాజధానిలో మరోసారి కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇది స్థానికులను మరిన్ని ఇబ్బందులకు గురిచేయనుంది. 

ఇటీవల ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం బాణసంచాపై సంపూర్ణ నిషేధం విధించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కాలుష్య స్థాయిలను తగ్గించేందుకు ‘కృత్రిమ వర్షం’ కురిపించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. 
ఇది కూడా చదవండి: అయోధ్యా నగరం! ఫొటోలను షేర్‌ చేసిన ప్రధాని మోదీ
 

మరిన్ని వార్తలు