దేశీయ అతిపెద్ద టెల్కో పేటీఎంతో జత
ప్రీపెయిడ్ కస్టమర్లకు క్యాష్బ్యాక్, ఫ్రీ వోచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు ఆకట్టుకునే వ్యూహాలు అమలును ప్రారంభించింది. వోడాఫోన్ , ఐడియా మెగా మెర్జర్ ద్వారా ఆవిర్భవించిన వోడాఫోన్ ఐడియా తాజాగా వినియోగదారులకు ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. రీచార్జ్లపై క్యాష్బ్యాక్, ఫ్రీ వోచర్లు అందిస్తున్నట్టు ప్రకటించింది. దీనికోసం పేటిఎంతో జతకట్టింది.
దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో పేటీఎం ద్వారా రీచార్జ్ చేసుకున్న వోడాఫోన్, ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు మంగళవారం తెలిపింది. ముఖ్యంగా రూ .149 కనీస రీఛార్జికి 25 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అలాగే దీనికి అదనంగా రూ.375 విలువ వోచర్లును అందిస్తుంది. వీటిని పేటీఎంమాల్ లో షాపింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు.
కాగా వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు యుపి వెస్ట్, పంజాబ్, చెన్నై, తమిళనాడులో కొత్త కాంబో ఆఫర్ను సోమవారం ప్రారంభించింది. 25 రూపాయల రీచార్జ్ పై ఉచిత డేటాతోపాటు తగ్గింపు రేటులో కాలింగ్ సదుపాయాన్ని కల్పించింది.