దండకారణ్యంలో మారణకాండ

13 Mar, 2018 15:19 IST|Sakshi
దాడి జరిగిన ప్రదేశం

9 మంది జవాన్ల మృతి

సాక్షి, సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి మారణహోమం సృష్టించారు. సీఆర్పీఎఫ్‌ జవాన్లపై మంగళవారం మెరుపుదాడి చేసి 9 మందిని బలిగొన్నారు. సుక్మా జిల్లా కిష్టారాం - పలోడి ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలను నక్సలైట్లు శక్తిమంతమైన మందుపాతరలతో పేల్చివేశారు. సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న కోబ్రా దళాల రాకను పసిగట్టి మవోయిస్టులు ఈ మెరుపు దాడికి దిగినట్టు తెలుస్తోంది. 

ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మందుపాతర పేలుడు నుంచి తేరుకునేలోపే మావోయిస్టులు కాల్పులకు దిగడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మందుపాతర దాడులను తట్టుకునే వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లు సైతం గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  ఈ దాడిలో 100 మంది మవోయిస్టులు పాల్గొన్నారని అంచనా. 

మృతి చెందిన వారిలో..ఏఎస్సై ఆర్కేఎస్‌ తోమర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మణ్‌, కానిస్టేబుల్స్‌ అజయ్‌ కేఆర్‌ యాదవ్‌, మనోరంజన్‌ లంక, జితేంద్ర సింగ్‌, శోభిత్‌ శర్మ, మనోజ్‌ సింగ్‌, ధర్మేంద్ర సింగ్‌, చంద్ర హెచ్‌ఎస్‌ లు ఉన్నారు.

మరిన్ని వార్తలు