ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. యువతి ఆత్మహత్యాయత్నం

24 Apr, 2019 07:48 IST|Sakshi

యువతి ఆత్మహత్యాయత్నం

కాచిగూడ:  పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి నెయిల్‌ పాలీష్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్స్‌పెక్టర్‌ జానకిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తిలక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌ కుమార్తె కె.లోచన ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. మిర్యాలగూడకు చెందిన దోసాపాటి సిద్దార్థతో షాదీ డాట్‌కామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు.

గత కొద్దిరోజులుగా లోచన పెళ్లి ప్రస్తావన తేగా సిద్దార్థ దాటవేస్తున్నాడు. ఈ విషయమై ఆమె కుటుంబ సభ్యులు అతడికి నచ్చజెప్పినా సిద్దార్థలో వైఖరిలో మార్పు రాకపోగా, తమ ఇంట్లో ఒప్పుకోవడం లేదని తేల్చి చెప్పాడు. దీంతో మనస్తాపానికి లోనైన ఆమె సోమవారం రాత్రి నెయిల్‌ పాలీష్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాచిగూడ పోలీసులు బాధితురాలిని విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ఆసుపత్రికి తరలించారు. లోచన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్‌ ఎస్‌ఐ  లక్ష్మయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు