ప్రియుడితో కలిసి వధువు పరార్‌

3 Nov, 2017 07:27 IST|Sakshi

ఆలయంలో వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించిన వైనం

అన్నానగర్‌: కొద్ది క్షణాల్లో వివాహం జరగాల్సి ఉండగా వధువు ప్రియుడితో కలిసి పరారైంది. వివరాలు.. వేలూరు జిల్లా తిరువలమ్‌పొన్నై కూట్‌రోడ్డుకు చెందిన యూరేషియా(24). అదే ప్రాంతంలో ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తోంది. ఈమె, రాణిపేట బెల్‌ సంస్థలో తాత్కాలిక కార్మికుడిగా పని చేస్తున్న కుడియాతలైకి చెందిన వెంకటేషన్‌(25) ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ స్థితిలో యురేషియాకు ఆమె కుటుంబీకులు వరుడిని చూసి బుధవారం వివాహానికి ఏర్పాట్లు చేశారు. రాణిపేట బెల్‌ వివాహ మండపంలో మంగళవారం రాత్రి విందు జరిగింది. ఆ సమయంలో మండపానికి వచ్చిన ప్రేమికుడు వెంకటేషన్‌ యూరేషియాకు గిఫ్ట్‌ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు.

అనంతరం గిఫ్ట్‌ తెరచి చూడమని యూరేషియాకి సైగ చేసి వెళ్లాడు. ఇలాఉండగా వేకువజామున 3 గంటలకు నలుగు పెట్టే సంప్రదాయం ప్రారంభించారు. ఆ సమయంలో యూరేషియా గది లేకపోవడం చూసి దిగ్భ్రాంతి చెందారు. బంధువులు ఆమెని వెతికే పనుల్లో నిమగ్నులయ్యారు. ఈ స్థితిలో యూరేషియా, వెంకటేషన్‌ లత్తేరిలోని ఆలయంలో వివాహం చేసుకొని పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న ఇరు కుటుంబాల బంధువులు అక్కడికి చేరుకున్నారు. ప్రేమ జంట మేజర్‌ కాబట్టి, వారి వివాహాన్ని అడ్డుకోవడానికి వీల్లేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు