లెక్చరర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి

22 Mar, 2020 09:28 IST|Sakshi
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న లెక్చరర్‌ సాయిరెడ్డి

ఖేడ్‌ గురుకులంలో ఘటన..

తాగివచ్చి దాడిచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన లెక్చరర్‌

సాక్షి, నారాయణఖేడ్‌: విచారణ అధికారులకు తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ నారాయణఖేడ్‌ సాంఘిక సంక్షేమ గురుకులం ప్రిన్సిపాల్‌ తనపై దాడిచేశాడంటూ జూనియర్‌ లెక్చరర్‌ సాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. నారాయణఖేడ్‌ మండలంలోని జూకల్‌ శివారులో సాంఘిక సంక్షేమ గురుకులం కొనసాగుతుంది. కాగా గురుకులానికి డా.మధుసూధన్‌ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో పలు విషయాలపై ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదులు వెళ్లడంతో రెండు రోజులపాటు గురుకులాల కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ అధికారులు విచారణ నిర్వహించారు.

గురుకులాల సిబ్బంది ద్వారా అధికారులు వివరాలు సేకరించారు. తాను ప్రిన్సిపాల్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని లెక్చరర్‌ సాయిరెడ్డి విలేకర్ల ముందు వాపోయారు. శనివారం అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో తాను నివసిస్తున్న క్వార్టర్‌ తలుపులను ప్రిన్సిపాల్‌ బాధడంతో తలుపులు తీశానని అన్నారు. తాగిన మైకంలో ఉన్న ప్రిన్సిపాల్‌ తనపై దాడికి తెగబడ్డాడని అన్నారు. అప్పటికే టెన్త్‌ విద్యార్థులు పలువురుని వెంట తీసుకొని ప్రిన్సిపాల్‌ వచ్చాడని అన్నారు. ప్రిన్సిపాల్‌ దాడిచేస్తుండడంతో విద్యార్థులు తనను కాపాడి రక్షించారని, ప్రిన్సిపాల్‌ను విద్యార్థులు బయటకు తీసుకెళ్లారని వాపోయారు. దాడిపై అదేరాత్రి తాను నారాయణఖేడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానని లెక్చరర్‌ సాయిరెడ్డి వివరించారు. 

ఆది నుంచి వివాదస్పదమే..  
కాగా నారాయణఖేడ్‌ గురుకుల ప్రిన్సిపాల్‌పై గత ఏడాది కాలంగా ఏవో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. విద్యార్థులతో పనులు చేయిస్తున్నాడని, వంట సరుకులు, చికెన్, మటన్‌ తక్కువగా ఇచ్చి, ఇవ్వకున్నా ఇచి్చనట్లు లెక్కలు రాస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో గురుకులాల కార్యదర్శికి ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేశారు. వంట సరుకులు కూడా తక్కువగా ఇస్తున్నారని, తమను దూషిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కాంట్రాక్టర్‌ సైతం గురుకులం ముందు ఆందోళనకు దిగారు. ఈ విషయాలు అప్పట్లో పత్రికల్లో రావడంతో ఆర్సీఓ విచారణ జరిపి మెమో కూడా జారీ చేశారు.   

విజిలెన్స్‌ విచారణ..  
రెండు రోజులపాటు గురుకులం ప్రిన్సిపాల్‌పై వచి్చన ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ అధికారి ఎం.డీ హుస్సేన్‌ గురుకులంలో విచారణ జరిపారు. ఆరోపణలు వాస్తవమా, కాదా, ఏం జరుగుతుందనే అంశాలపై విజిలెన్స్‌ అధికారులు సిబ్బంది, విద్యార్థులను ఆరా తీశారు.  

విచారణ చేస్తున్నాం..  
లెక్చరర్‌ సాయిరెడ్డిపై ప్రిన్సిపాల్‌ మదుసూధన్‌ దాడిచేసిన విషయంపై ఎస్‌ఐ సందీప్‌ను వివరణ కోరగా దాడిచేసినట్లు ఫిర్యాదు వచ్చిందని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సమాధానం ఇచ్చారు. ప్రిన్సిపాల్‌ మదుసూధన్‌ వివరణకోసం ప్రయతి్నంచగా ఆయన స్పందించలేదు.  

మరిన్ని వార్తలు