మందుల మోసం..

14 Mar, 2018 12:37 IST|Sakshi
కాకినాడ మందుల దుకాణంలో మందులను సీజ్‌ చేసి కేసు ఫైల్‌ చేస్తున్న డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు

కంపెనీలు, షాపులపై ఔషధ నియంత్రణ అధికారుల దాడులు

కాకినాడ లీగల్‌: జిల్లాలో అధిక ధరలకు మందుల విక్రయం, నాసిరకం మందులు అమ్ముతు న్న కంపెనీలు, దుకాణదారులపై జిల్లా ఔషధ నియంత్రణ ఏడీ టి.శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో డ్రగ్‌ఇన్స్‌పెక్టర్లు మంగళవారం దాడులు చేశారు. కొన్ని రకాల మందుల షీట్స్‌పై అధిక రేట్లు వేసి విక్రయించడమే కాకుండా..నాసిరకం మందులు విక్రయిస్తున్న కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు. కాకినాడ అర్బన్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.చంద్రరావు, కాకినాడ రూరల్‌ డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ వీఎస్‌ జ్యోతి మంగళవారం కాకినాడలో వివిధ ముందులదుకాణాలపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు.

శ్రీరామ్‌సాయి మెడకిల్‌ డిస్ట్రిబ్యూటర్స్‌కు చెందిన దుకాణంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన లేబొరేట్‌ ఫార్మాస్యుటికల్స్‌ ఇండియాలిమిటెడ్‌ కంపెనీకి సంబంధించిన మూడు రకాల మందులపై అధిక ధరలు ముద్రించినట్టు గుర్తించారు. జెంటాలాబ్‌ ఇంజక్షన్‌ 30ఎంఎల్‌ ఎంఆర్‌పీ 73.50 పైసలుగా ముద్రించారు. కానీ ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.27.65పైసలు మాత్రమే. జెంటాలాబ్‌ ఇంజక్షన్‌ 10ఎంఎల్‌ ఎంఆర్‌పీ 24.50 పైసలుగా ముద్రించారు. అసలు ధర రూ.16.675 పైసలకు విక్రయించాలి. డిక్సీలాబ్‌ ఇంజక్షన్‌ 30 ఎంఎల్‌ ఒకటి రూ.84.50పైసలుగా ముద్రించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.35.85పైసలు ఉండాలి. అధిక ధరకు విక్రయిస్తున్నందుకు డ్రగ్‌ ప్రైస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌–2013 చట్టం ఉల్లంఘన కింద డ్రగ్‌ఇన్‌స్పెపెక్టర్లు మందులను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత మందుల కంపెనీపై కేసు నమోదుచేసి కాకినాడ మూడో అదనపు జ్యూడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌కోర్టులో హాజరుపరిచారు. ఏడీ టి.శ్రీరామమూర్తి మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని దుకాణాలు, కంపెనీలను తనిఖీ చేయనున్నట్టు వెల్లడించారు.

మరిన్ని వార్తలు