గేదెల రాజును హత్య చేయించింది నేనే

22 Oct, 2017 03:49 IST|Sakshi

అంగీకరించిన డీఎస్పీ రవిబాబు

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ రౌడీషీటర్‌ కొప్పెర్ల సత్యనారాయణరాజు అలియాస్‌ గేదెల రాజును హత్య చేయించింది తానేనని ఆర్టీసీ విజిలెన్స్‌ డీఎస్పీ దాసరి రవిబాబు పోలీసుల ఎదుట అంగీకరించాడని విశాఖ సిటీ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ–2 రవికుమార్‌మూర్తి వెల్లడించారు. ఇందుకోసం భూపతిరాజు శ్రీనివాసరాజుతో డీల్‌ కుదుర్చుకున్నాడని, తన కుమారుడి ఖాతా నుంచి రూ.10 లక్షల చెక్‌లను కూడా రవిబాబు ఇచ్చాడని చెప్పారు.  చోడవరం పోలీస్‌స్టేషన్‌ లో శుక్రవారం లొంగి పోయిన రవిబాబును రూరల్‌ ఎస్పీ.. సిటీ పోలీసులకు అప్పగించగా, శనివారం మీడియా ఎదుట హాజరుపర్చారు. అనంతరం జిల్లా కోర్టు అతనికి 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

ఆ వెంటనే పోలీసు కస్టడీ కోరుతూ సిటీ పోలీసులు  పిటిషన్‌ వేశారు. గేదెల రాజు హత్యలో రవిబాబు పాత్రతోపాటు, పద్మలత మృతి కేసులో కూడా  సాక్ష్యాలను సేకరించామని డీసీపీ వెల్లడించారు.  భూపతిరాజు, అతని డ్రైవర్‌తో పాటు బీచ్‌రోడ్‌ గెస్ట్‌హౌస్‌ భేటీలో పాల్గొన్న వారి కోసం గాలిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి మురళీనగర్‌లోని రవిబాబు ఇంట్లో ఏసీపీ రంగరాజు ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పాస్‌పోర్టు, చెక్‌బుక్‌లు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు