చెన్నంగులగడ్డతండాలో ఉరేసుకున్న యువరైతు
బాలానగర్ (జడ్చర్ల): అప్పులబాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని పెద్దాయపల్లి గ్రామ పంచాయతీ చెన్నంగులగడ్డతండాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... బాబునాయక్ (33) తన వ్యవసాయ పొలంలో నాలుగుబోర్లు వేసి అప్పులపాలయ్యాడు. అప్పు తీర్చే స్తోమత లేక భార్య లీలను ఆమె పుట్టింటికి పంపాడు. మూడురోజుల తర్వాత కూడా డబ్బు సర్దుబాటు కాలేదు.
ఇదే విషయాన్ని ఆమె ఫోన్లో తెలిపింది. అప్పిచ్చిన వారికి ఏం సమాధానం చెప్పాలంటూ మదనపడిన బాబునాయక్ శనివారం రాత్రి తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఎంతకూ తలుపులు తీయకపోవడాన్ని తండ్రి హేమ్య నాయక్ గమనించాడు. ఎంత పిలిచినా పలకకపోవడంతో ఇరుగుపొరుగు వారితో కలిసి తలుపులు పగులగొట్టాడు. కొడుకు ఉరేసుకోవడాన్ని చూసి, పోలీసులకు, భార్యకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.