ట్రంప్‌ టవర్‌లో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

8 Apr, 2018 08:58 IST|Sakshi

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ట్రంప్‌ టవర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి గాయాలైనట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 

న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్‌ 50వ అంతస్థులో గత రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. హుటాహుటినా భవనంలోని వారిని ఖాళీ చేయించారు. అయితే ప్రమాదంలో 67 ఏళ్ల వృద్ధుడొకరు పొగ కారణంగా ఊపిరాడక స్పృహ కోల్పోగా.. ఆయన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు సహయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది నలుగురు గాయపడినట్లు న్యూయార్క్‌ పోలీసులు తెలిపారు. 

కాగా, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రమాదంపై డొనాల్డ్‌ ట్రంప్‌ తన ట్విటర్‌లో స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ... సహయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని ఆయన అభినందించారు.

మరిన్ని వార్తలు