26 మంది సజీవ దహనం
బీజింగ్: చైనాలోని షాంగ్జి ప్రావిన్స్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోగా మరో 38 మంది గాయపడ్డారు. లియులింగ్ నగరంలోని లిషి ప్రాంతంలో గురువారం ఉదయం 6.50 గంటలకు ఘటన చోటుచేసుకుంది.
బొగ్గు గని కంపెనీకి చెందిన అయిదంతస్తుల భవనంలోని రెండో అంతస్తులో మొదలైన మంటలు భవనమంతటికీ వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది శ్రమించి మంటలను మధ్యాహ్నం 1.45కి అదుపులోకి తెచ్చారని చెప్పారు. చైనాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. భద్రతా ప్రమాణాలను పట్టించుకోకపోవడం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే వీటికి కారణమని చెబుతున్నారు.