గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు 

12 Jun, 2019 02:59 IST|Sakshi

82 కిలోల గంజాయి స్వాధీనం  

ఐదుగురు అరెస్టు  

హైదరాబాద్‌: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు అంతరాష్ట్ర ముఠాను ఎల్‌బీ నగర్‌ ఎస్‌ఓటీ, మీర్‌పేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 82 కిలోల గంజాయి, ఒక బైక్, రూ.35 వేల నగదు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన కమోజీ కొండల్‌ (31) నగరంలో మీర్‌పేటలో నివాసం ఉంటూ గంజాయి సరఫరా చేస్తున్నాడు. కొండల్‌ 2017లో గంజాయి సరఫరా చేస్తూ తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మోతిగూడం పోలీసు స్టేషన్‌లో పట్టుబడాడు.

పోలీసులు అతడిని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపించారు. జైల్లో తూర్పు గోదావరి జిల్లా రామవరం మండలానికి చెందిన ఫంగితెలి తేజ (28) పరిచయమయ్యాడు. జైలు నుంచి వచ్చిన తరువాత వీరిద్దరూ కలిసి గంజాయి సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. తేజ విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి, పాడేరు, ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన రాజు పరిచయమయ్యాడు. ఇతడు కూడా గంజాయి సరఫరా చేస్తుంటాడు. వీరితోపాటు విశాఖ జిల్లాకు చెందిన నాగార్జున, చిన్నబాబులతో కలసి ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని ట్రావెల్‌ బ్యాగుల ద్యారా నగరానికి తెచ్చేవారు. దీనిని కొండల్‌ నివాసం వద్ద నిల్వ ఉంచారు.  

పోలీసులకు పట్టుబడిందిలా.. 
మంగళవారం ఆసిఫ్‌ నగర్‌కు చెందిన సుబేడర్‌ వినోద్‌ సింగ్‌ కొండల్‌ దగ్గర 10 కేజీల గంజాయిని రూ.30 వేలకు కొనుగోలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కొండల్‌ ఇంటిపై దాడి చేసి 82 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినోద్‌ సింగ్‌ కొనుగోలు చేసిన గంజాయిని 100 గ్రాములుగా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మార్చి నగరంలోని విద్యాసంస్థల వద్ద అమ్మతున్నట్లు గుర్తించారు. అనంతరం కొండల్, ఫంగితెలి తేజ, నాగార్జున, చిన్నబాబు, వినోద్‌ సింగ్‌లను అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన రాజు పరారీలో ఉన్నాడని.. త్వరలో అతడిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు