పెళ్లి బారాత్‌లో అపశ్రుతి

4 May, 2018 08:57 IST|Sakshi
చికిత్స పొందుతున్న దేవిసింగ్‌

డీజే ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌ను  స్టార్ట్‌ చేసిన ఓ యువకుడు 

పలువురిపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌ ఒకరు మృతి

పెళ్లికొడుకుతో  సహాపలువురికి తీవ్రగాయాలు

నిజామాబాద్‌ లింగంపేట(ఎల్లారెడ్డి) : పెళ్లి వేడుకల్లో అపశ్రుతి జరగడంతో ఒక వృద్ధురాలు మృతి చెందగా, పెళ్లికొడుకు, మరో మహిళలకు తీవ్రగాయాలైన సంఘటన లింగంపేట మండలం లింగంపల్లి పంచాయతీ పరిధిలోని కొయ్యగుండు తండాల్లో చోటు చేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన అమ్రియానాయక్‌ కుమారుడు దేవిసింగ్‌ వివా హం బుధవారం నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండ లం బైరాపూర్‌ తండాలో జరిగింది.

వివాహానంతరం పెళ్లికొడుకు, పెళ్లికూతురు, బంధువులు రాత్రి బైరాపూర్‌ తండా నుంచి కొయ్యగుండు తండాకు చేరుకున్నారు. తండా సమీపంలోని గిరిజనుల ఆలయం వద్ద పూజలు చేసి ఇంటికి డీజే సౌండ్‌ సిస్టమ్‌తో నృత్యాలు చేసుకుంటూ వెళ్తున్నా రు. ఇంటి సమీపంలో నిలిపిఉన్న ట్రాక్టర్‌ను బంధువుల యువకుడు స్టార్ట్‌ చేయడంతో గేర్‌లో ఉన్న ట్రాక్టర్‌ బారాత్‌ తీస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను కామారెడ్డిలోని రుద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పెళ్లి కూతురు బంధువు మాలీబాయి(68) మృతిచెందింది. ట్రాక్టర్‌ ముందు నడుస్తున్న పెళ్లి కొడుకు, పెళ్లికూతురితో పాటు పలువురిపై ట్రాక్టర్‌ దూసుకెళ్లడంతో పెళ్లి కొడుకు కేతావత్‌ దేవిసింగ్‌ చాతిపైకి ట్రాక్టర్‌ చక్రం ఎక్కగా తండావాసులు వెంటనే టైర్‌ను పైకి లేపి బయటకు తీశారు. ఈ ఘటనలో తండాకు చెందిన కేతావత్‌ బగ్లీ, శాంత, సునీత, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి ముగించుకుని ఇంటికి చేరుకున్న బంధువులు ఇంట్లోకి వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి.   

మరిన్ని వార్తలు