నిషేధిత గుట్కా, గంజాయి విక్రయాలపై దాడులు

27 Jan, 2020 12:47 IST|Sakshi
నిందితుడి వివరాలను వెల్లడిస్తున్న నగర డీఎస్పీ జే శ్రీనివాసులరెడ్డి

 రూ.2.80లక్షల విలువైన సరుకు స్వాధీనం

నిందితుడి అరెస్ట్‌  

నెల్లూరు(క్రైమ్‌): నిషేధిత గుట్కా, జర్ధా, గంజాయిని విక్రయిస్తున్న వ్యాపారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి రూ.2.80లక్షల విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జే శ్రీనివాసులరెడ్డి వివరాలను వెల్లడించారు. నగరంలోని పాతపెద్దాస్పత్రి మెక్లిన్స్‌రోడ్డుకు చెందిన ఎన్‌ వెంకటేషన్‌ అలియాస్‌ వెంకటేష్‌ బడ్డీకొట్టు నిర్వహిస్తున్నాడు.

గత కొంతకాలంగా బెంగుళూరు నుంచి నిషేధిత గుట్కాలు, జర్ధాలు, విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని ఇంట్లోనే నిల్వచేసేవాడు. అనంతరం నెల్లూరు నగరం, పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న చిన్నబజారు పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం  మధుబాబు ఈ నెల 25న ఎస్సై రవినాయక్, సిబ్బందితో కలిసి వెంకటేష్‌ ఇంటిపై దాడిచేశారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.2.60లక్షల విలువచేసే 190టన్నుల నిషేధిత జర్ధా, 83,767 ప్యాకెట్ల గుట్కా, ఖైనీలు, రూ.20వేల విలువచేసే రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడ్ని అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.  నిందితుడ్ని అరెస్ట్‌ చేయడంలో ప్రతిభ కనపరిచిన ఇన్‌స్పెక్టర్, ఎస్సైలతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ భాస్కర్‌రెడ్డి, కానిస్టేబుల్స్‌ రాజా, వెంకటేశ్వర్లు, అల్తాఫ్‌ షంషుద్దీన్‌ను అభినందించి రివార్డులు ప్రకటించారు.  ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు, ఎస్సైలు రవినాయక్, పీ  చిన్నబలరామయ్య, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు