బైక్‌ పైనుంచి దూకిన మహిళ మృతి

3 Apr, 2018 11:17 IST|Sakshi

తొగుట(దుబ్బాక): బైక్‌ పైనుంచి దూకి గాయపడిన మహిళ సోమవారం మరణించిందని తొగుట ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన నరెడ్ల భారతమ్మ (50) రోజూ సిద్దిపేటలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం సిద్దిపేటకు వెళ్లి తిరిగి వచ్చేందుకు ఘణపురం వెళ్లే ఆటోలో మెట్టు వరకు వచ్చింది.

అక్కడ మరో ఆటోకోసం ఎదురుచూస్తున్న క్రమంలో వేములఘాట్‌ మదిర తుర్కబంజేరుపల్లికి చెందిన ఇరుగదిండ్ల ప్రశాంత్‌ బైక్‌ ఎక్కింది. ఈ క్రమంలో అతడు ఎల్లారెడ్డిపేట స్టేజీ వద్ద బైక్‌ ఆపకుండా వెళ్తున్నాడు. దీంతో భయాందోళనకు గురైన భారతమ్మ బైక్‌ పైనుంచి కిందకు దూకింది. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమెను ప్రశాంత్‌ చికిత్స కోసం సిద్దిపేటకు  తరలించాడు.

పరిస్థితి విషమంగా మారడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రజ్ఞాపూర్‌ వద్ద భారతమ్మ మృతిచెందింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ వివరించారు. 

మరిన్ని వార్తలు