ప్రియుడి ఇంటి ఎదుట యువతి దీక్ష

26 Aug, 2018 09:03 IST|Sakshi
ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న ఉమ

కామేపల్లి (ఖమ్మం): ప్రేమ పేరుతో తనను మోసగించాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి, తన బంధువులతో కలిసి మౌన దీక్షకు దిగింది. మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీ శ్రీరాంనగర్‌ తండాలో శనివారం ఇది జరిగింది. ఆ యువతి యువతి దరావత్‌ ఉమ తెలిపిన వివరాలు... కామేపల్లి మండలం శ్రీరాంనగర్‌ తండాకు చెందిన భూక్య నరేష్, గార్ల మండలం కోట్యానాయక్‌ తండాకు చెందిన దరావత్‌ ఉమ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని అద్దె గదిలో రెండేళ్లపాటు ఉన్నారు.

నరేష్‌కు ఇటీవల వ్యవసాయ శాఖలో ఏఈఓగా ఉద్యోగమొచ్చింది. తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరింది. అతడు నిరాకరించాడు. దీంతో, ఆమె మూడు రోజుల క్రితం పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో తన ప్రియుడు నరేష్‌ ఇంటి ఎదుట, తన బంధువులతో కలిసి శనివారం మౌన దీక్షకు దిగింది. తనను పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లపాటు నమ్మించి, తనతోపాటు కలిసుండి, ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేంత వరకు మౌన దీక్షను కొనసాగిస్తానంది.

మరిన్ని వార్తలు