అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త

15 Jul, 2019 11:25 IST|Sakshi

వివాహిత అనుమానాస్పద మృతి

దహన సంస్కారాల అనంతరం హత్యగా వెలుగులోకి..

సాక్షి, యద్దనపూడి: అనారోగ్యంతో చనిపోయిందని భావించిన వివాహత మృతి వ్యవహారం ఆ తర్వాత హత్యగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మండల కేంద్రం యద్దనపూడిలో జరిగింది. స్థానికులు, సీఐ రాంబాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నూతలపాటి లక్ష్మీరాజ్యం (50) అనారోగ్యంతో ఈ నెల 11వ తేదీ గురువారం వేకువ జామున మృతి చెందినట్లు భావించి కుటుంబ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలు చేశారు.

మృతురాలి కుమార్తె లావణ్య తన తల్లి మరణం సహజంగా జరిగింది కాదని అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో బంధువులు, గ్రామ పెద్దలు మృతురాలి భర్త నూతలపాటి వేణుగోపాలరావును నిలదీశారు. తన భార్యను తానే హత్య చేసినట్లు అతడు నేరం అంగీకరించాడు. మృతురాలి కుమార్తె లావణ్య స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇంకొల్లు సీఐ రాంబాబు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. వికలాంగుడైన వేణుగోపాలరావు ఒక్కడే హత్యకు పాల్పపడి ఉండడని, ఇంకా ఎవరైనా సహకరించి ఉంటారనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. 

మరిన్ని వార్తలు