అత్తింటి ఆరళ్లకు యువతి బలి

24 Sep, 2019 12:28 IST|Sakshi
కుమార్తె మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు  

సాక్షి, పెట్లూరు (ప్రకాశం): ఆ యువతికి వివాహమై ఏడాదిన్నరే. ఏమైందో ఏమో గానీ అత్తారింట్లో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని పెట్లూరులో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి కుమార్తె శవాన్ని చూసి తమ కుమార్తెను భర్త, అత్తమామలు చంపి ఉరేశారని ఎస్‌ఐ, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. పెట్లూరు ఎస్సీ కాలనీకి చెందిన ఆరితోటి వినోద్‌కు బల్లికురవ మండలం వైదన గ్రామానికి చెందిన మేరిమ్మ అలియాస్‌ స్వాతి (21)తో సుమారు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. మేరిమ్మ తాను నిద్రించిన గది నుంచి బయటకు వచ్చి టాయిలెట్‌కి వెళ్లి పక్కనే ఉన్న మరో గదిలొ శ్లాబ్‌ కొక్కేనికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కోడలు గదిలో నిర్జీవంగా వేలాడుతూ ఉండటాన్ని చూసిన అత్త బిగ్గరగా కేకలేసింది. ఇంట్లోని కుమారులు, కాలనీలోని మరి కొందరు వచ్చి చూన్నీ కోసి మేరిమ్మను కిందకు దించగా అప్పటికే మృతి చెందింది.

మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి ఇది ముమ్మాటికీ హత్యేనని పోలీసులు తహసీల్దార్‌ ఎదుట వాపోయారు. తమ కుమార్తెను అత్తింటివారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అఘాయిత్యం ఎందుకు జరిగిందని చనిపోయిన కుమార్తె మృతదేహం వద్ద రోధించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  అనుమానాస్పద మృతి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు. తహసీల్దార్‌ సుజాత సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి మృతురాలి తల్లిదండ్రులు, అత్తమామలు, భర్తతో మాట్లాడి వివరా>లు సేకరించారు. 

మరిన్ని వార్తలు