ఎంబీబీఎస్‌ విద్యార్థిని బలవన్మరణం

9 Aug, 2018 13:27 IST|Sakshi
మృతురాలు హిమజా

మార్కులు సరిగా రావడం లేదని మనస్తాపంతోనే..

చిట్టినగర్‌ (విజయవాడ వెస్ట్‌): మార్కులు సరిగా రాకపోవడంతో మానసికంగా కుంగిపోయిన ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేట మాకిన వారి వీధికి చెందిన చోడవరపు జ్యోతి ప్రకాష్‌ ఆర్‌ఎంపీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జ్యోతి ప్రకాష్‌ భార్య రాజరాజేశ్వరి ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌ కాగా కుమార్తె హిమజా(22) ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతుంది. రెండో సంవత్సరంలోని కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడంతో ఇటీవల సప్లిమెంటరీ రాసింది. అందులో కూడా మార్కులు సరిగా రాలేదు. దీంతో కొంత కాలంగా మానసికంగా కుంగి పోయింది.

ఈ నేపథ్యంలో హిమజా బుధవారం సాయంత్రం 5 గంటలకు యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చిం ది. అప్పుడు తండ్రి జ్యోతిప్రకాష్‌ క్లినిక్‌ వెళ్లేందుకు బయలుదేరారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న హిమజా కొంత సేపటి తర్వాత లోపలకు వెళ్లి ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత పక్క వీధిలో నివాసం ఉండే అక్క ప్రియాంక ఇంటికి వచ్చి చూడగా చెల్లెలు ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే తన భర్తకు ఫోన్‌ చేయగా, హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటేనే తండ్రికి సమాచారం ఇచ్చి హిమజాను కిందకు దింపి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే హిమజా మృతి చెందినట్లు గుర్తించారు. కొత్తపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం ఘటనకు సంబంధించి వివరాలను నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు