మిస్డ్‌కాల్‌ పాపం.. రూ.5లక్షల మోసం

1 May, 2019 10:31 IST|Sakshi

అనంతపురం, రాయదుర్గం రూరల్‌: మిస్డ్‌ కాల్‌తో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి అవసరం నిమిత్తం రూ.5లక్షలు ఇచ్చి మోసపోయిన ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉదంతం ఒకటి వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. తిరుపతిలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఎక్స్‌రే ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉన్నగర నాగరాజు సెల్‌కు ఓ మిస్డ్‌ కాల్‌ వచ్చింది. ఎవరు చేశారోనని ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాడు. పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. నెల రోజులకు పైగా రోజూ ఫోన్‌ ద్వారానే సంభాషించుకున్నారు.

పదిహేను రోజుల క్రితం తనకు డబ్బు అవసరం వచ్చింది.. ఐదు లక్షలు కావాలని మిస్డ్‌ కాల్‌ చేసిన వ్యక్తి అయిన రాయదుర్గం పట్టణానికి చెందిన రమేష్‌ అడిగాడు. వారం రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన టెక్నీషియన్‌ అతడిని తిరుపతికి పిలిపించుకుని రూ.ఐదు లక్షలు సర్దుబాటు చేసి పంపించాడు. వారం రోజుల తరువాత కాల్‌ చేస్తే రమేష్‌ సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ అని రావడంతో ల్యాబ్‌ టెక్నీషియన్‌కు గుండె ఆగినంత పనైంది. అనుమానం వచ్చి తిరుపతి నుంచి రాయదుర్గం వచ్చాడు. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తన గోడు వెల్లబోసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు.

మరిన్ని వార్తలు