జయనగర: కర్ణాటకలోని చిక్కమగళూరులో బీజేపీ మైనారిటీ నేత మహ్మద్ అన్వర్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా కేంద్రం బసవనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలోని గౌరీకాలువ ప్రాంతం లో జరిగింది. బీజేపీ చిక్కమగళూరు ప్రధాన కార్యదర్శిగా ఉన్న మహ్మద్ అన్వర్ (46) శుక్రవారం రాత్రి 9.35 గంటల సమయంలో తన ఇంటి వద్ద కారు దిగుతుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన్ను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ హత్యతో చిక్కమగళూరులో శనివారం దుకాణాలు మూసి వేయడంతో బంద్ వాతావరణం కనిపించింది. జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారు. వ్యక్తిగత కక్షలతోనే ప్రత్యర్థులు దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులకు అడ్డుగోడగా నిలిచినందునే అన్వర్ను పొట్టనబెట్టుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి మండిపడ్డారు.