‘ప్రణయ్‌’ నిందితులపై పీడీ యాక్ట్‌!

16 Oct, 2018 02:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ పరువు హత్య కేసు నిందితులపై పీడీ యాక్ట్‌ మోపాలని పోలీస్‌శాఖ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నులపై నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌తో వెస్ట్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ కేసులో ఉన్న నిందితుల నేరచరిత్ర వెలుగులోకి తీసుకురావడంతో పాటు పాత నేరాల ఆధారంగా వారిపై పీడీ యాక్ట్‌ మోపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు ప్రణయ్‌ భార్య అమృతకు సోషల్‌ మీడియాలో వస్తున్న బెదిరింపులపై స్టీఫెన్‌ రవీంద్ర ఆరా తీశారు.

అమృతను బెదిరిస్తున్న వారి సోషల్‌మీడియా ఖాతా వివరాలు తెలుసుకోవటంతో పాటు హంతకులతో వారికేమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో దర్యా ప్తు చేపట్టాలని ఐజీ ఆదేశించినట్లు తెలిసింది. బెదిరింపుల వ్యవహారంపై ఇప్పటికే అమృత పోలీసులకు ఫిర్యాదు చేసిందని, దీంతో ఆమెకు భద్రతగా ఇద్దరు సాయుధ సిబ్బందితో పాటు ఇద్దరు మహిళా పోలీసుల్ని కూడా నియమించినట్లు నల్లగొండ పోలీసులు తెలిపారు. ఆమెకు వస్తున్న బెదిరింపులు, భద్రత వ్యవహారలపై ఎప్పటికప్పుడు నిఘా విభాగం అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు