టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై కేసు నమోదు

4 Oct, 2018 20:45 IST|Sakshi
ఏనుగు రవీందర్‌ రెడ్డి

సాక్షి, కామారెడ్డి : ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణతో స్థానిక తహసీల్దార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలతో తహసీల్దార్‌ రంజిత్‌ కుమార్‌ ఆయనపై ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ 171కింద కేసు నమోదైంది.  

అసలేం జరిగింది...
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈసీ విచారణకు ఆదేశించింది. డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షలు ఇస్తానంటూ రవీందర్‌రెడ్డి మాట్లాడిన వీడియో ఫుటేజీల ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

విచారణ జరిపి నివేదిక పంపిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా సంఘాలకు రూ. 5 లక్షలు ఇస్తానంటూ వాగ్దానం చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి సురేందర్‌ తదితరులు శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వీడియో ఫుటేజీని జతచేశారు. 

మరిన్ని వార్తలు