హెచ్‌సీయూ వీసీ అప్పారావు హత్యకు కుట్ర

31 Mar, 2018 15:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) వైస్‌ ఛాన్సులర్‌ అప్పారావు హత్యకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు హెచ్‌సీయూ విద్యార్థులను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం-చర్ల రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా హెచ్‌సీయూ విద్యార్థులు చందన్‌ మిశ్రా, పృధ్వీరాజ్‌ పోలీసులకు చిక్కారు.  కాగా 2013లో రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ప్రతీకారంగా వీసీ అప్పారావు హత్యకు వీరు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర చంద్రన్నదళ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు హరిభూషణ్‌ అలియాస్‌ యాపా నారాయణ ఆదేశాలతో హత్యకు స్కెచ్‌ వేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. హెచ్‌సీయూలో ఎంఏ చదువుతున్న చందన్‌ కుమార్‌ మిశ్రా కోల్‌కతా వాసి. ఇక అంకల పృధ్వీరాజ్‌ కృష్ణాజిల్లా కేసరపల్లికు చెందినవాడు. వీరిద్దరికీ హెచ్‌సీయూలో పరిచయం ఉన్నట్లు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు. వీరిని శనివారం మీడియా ఎదుట హాజరు పరిచారు. మరోవైపు వీరిద్దర్ని వారం క్రితమే పోలీసులు పట్టుకున్నారని విరసం ఆరోపిస్తోంది. వారిద్దరినీ విడుదల చేయాలని విరసం ఇప్పటికే పోస్టర్లు విడుదల చేసింది.

ఇక ఈ ఘటనపై హెచ్‌సీయూ వీసీ అప్పారావు స్పందిస్తూ...‘నాకు ఎటువంటి బెదిరింపులు రాలేదు. నన్ను చంపడం కోసం ఎవరు కుట్ర చేశారో కూడా తెలియదు. పోలీసులు కూడా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం హెచ్‌సీయూ ప్రశాంతంగా ఉంది.’ అని అన్నారు.

మరిన్ని వార్తలు