ప్రణయ్‌ హత్యకేసు ; చార్జిషీటు దాఖలు

12 Jun, 2019 15:03 IST|Sakshi

సాక్షి, నల్గొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసులో మిర్యాలగూడ పోలీసులు జిల్లా కోర్టులో బుధవారం చార్జిషీటు దాఖలు చేశారు. మొత్తం 102 మంది సాక్షులను విచారించిన పోలీసులు 1600 పేజీలతో చార్జిషీటు, 63 పేజీల్లో విచారణ నివేదిక కోర్టుకు సమర్పించారు. తమ కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో ప్రణయ్‌ను అమృత తండ్రి తిరునగరు మారుతీరావు దారుణంగా హత్యచేయించిన సంగతి తెలిసిందే.
(ప్రణయ్‌ హత్య కేసు నిందితులు బెయిల్‌పై విడుదల)

ఈ ఘటన గతేడాది సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడ పట్టణంలో పట్టపగలే జరిగింది. ప్రణయ్‌ హత్యకేసులో అరెస్టయిన నిందితులు మారుతీరావు, అతని తమ్ముడు శ్రావణ్‌, మరొక నిందితుడు కరీంపై గతేడాది సెప్టెంబర్‌ 18న పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించగా... ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక ఈ ముగ్గురితోపాటు మరో ఐదుగురి పేర్లను కూడా పోలీసులు చార్జిషీటులో చేర్చారు. హత్యజరిగిన 9 నెలల అనంతరం చార్జిషీటు దాఖలు చేయడం గమనార్హం. 

మరిన్ని వార్తలు