మాయ‘లేడీ’లు

29 Dec, 2018 08:39 IST|Sakshi
బాధితుడు అందజేసిన సీసీ పుటేజ్‌

ఫ్యాషన్‌ జ్యూయలరీ షాపులో చోరీ

పెదవాల్తేరు(విశాఖతూర్పు): షాపింగ్‌ అని వచ్చిన నలుగురు మహిళలు తమ చేతివాటాన్ని చూపించారు. అందినకాడికి వన్‌గ్రామ్‌ గోల్డ్‌ చాకచక్యంగా అపహరించారు. చినవాల్తేరు మసీదు రోడ్డులో లతీష్‌ కృష్ణ ఫ్యాషన్‌ జ్యుయలరీ షాపులో ఈ సంఘటన జరిగింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇద్దరు మహిళలు షాప్‌కు వచ్చారు. వీరు షాపింగ్‌ చేస్తూ ఫోన్‌చేసి మరో ఇద్దరు మహిళలను రప్పించారు. వీరు నలుగురూ షాపింగ్‌ చేస్తున్నట్టు నమ్మించి ఆభరణాలు చోరీ చేశారు.

అప్పుడు దుకాణంలో షాపు యజమాని నర్సింహారావు భార్య పరమేశ్వరి , ఇతర సిబ్బంది ఉన్నారు. రాత్రి దుకాణం మూసే సమయంలో యజమాని నర్సింగరావు వచ్చి ఆభరణాలు చోరీ జరిగాయని గుర్తించారు. దుకాణంలోని సీసీ పుటేజీలు పరిశీలించగా సదరు నలుగురు మహిళలు ఆభరణాలు చోరీ చేసినట్టు రికార్డు అయింది. దుకాణంలో నెక్లెస్‌లు, చైన్లు వంటి వన్‌గ్రాము గోల్డు ఆభరణాలు చోరీ అయినట్టు గుర్తించారు. వీటి విలువ రూ.40వేలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దుకాణం యజమాని నర్సింహారావు శుక్రవారం రాత్రి మూడవ పట్టణ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్‌ క్రైం  సీఐ పీవీవీ ఎస్‌ఎన్‌ కృష్ణారావు పర్యవేక్షణలో ఎస్‌ఐ శ్యామ్‌సుందర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు