యువకుడి అనుమానాస్పద మృతి

25 Jan, 2019 10:51 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, గుమిగూడిన ప్రజలు మొండి సందీప్‌(ఫైల్‌) 

ప్రేమ వ్యవహారమే కారణమా? 

పోస్టుమార్టం నిరాకరించిన ఆర్మూర్‌ వైద్యులు 

జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలింపు

భీమ్‌గల్‌: మండలంలోని సికింద్రాపూర్‌ గ్రామాని కి చెందిన మొండి సందీప్‌(24) అనే యువకుడు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందా డు. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అవివాహితుడైన సందీప్‌ బతుకుదెరువు కోసం దుబాయ్‌కు వెళ్లి ఆర్నెళ్ల క్రితం గ్రామానికి తిరిగివ చ్చాడు. అయితే బుధవారం ఇంటి నుంచి వెళ్లిన సందీప్‌ ఎంతకూ ఇంటికి తిరిగి రాలేదు.  దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా సమాధానం ఇవ్వలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు పలుచోట్ల గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం ఉదయం తలోవైపు గాలించిన గ్రామస్తులకు గ్రామ శివారులోని సందీప్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో విగత జీవిగా కనిపించాడు.

అక్కడే పొలంలో వాడే క్రిమి సంహారక మందులు ఉన్నాయి. సందీప్‌కు ఎటువంటి సమస్యలు లేవని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవస రం లేదని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. అయితే సందీప్‌కు గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం విషయంలో రెండ్రోజులుగా కొందరితో గొడవ జరుగుతున్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో సందీప్‌ మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం మేరకు భీ మ్‌గల్‌ ఎస్‌ఐ– 2 భీమ య్య సంఘటనా స్థలానికి వెళ్లి శవ పంచనామా నిర్వహించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్‌కు తరలించారు. అయితే ఆర్మూర్‌లో మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. వారు పోస్టుమార్టం చే సేందుకు నిరాకరించి నిజామాబాద్‌కు సిఫారసు చేయడంతో మృతదేహాన్ని నిజామాబాద్‌కు తరలించారు. మృతుడికి తండ్రి లేడు. తల్లి, ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. కాగా సోదరుడు గల్ఫ్‌ లో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ కర్నె శ్రీధర్‌ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు