పబ్‌జీ ఆడినందుకు 10 మంది అరెస్ట్‌

15 Mar, 2019 10:23 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌ పబ్‌జీ ఆడినందుకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గత మూడు రోజుల్లో పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఆరుగురు కాలేజీ విద్యార్థులున్నారు. పబ్‌జీ (ప్లేయర్‌ అన్‌నోన్స్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌), మొమొ చాలెంజ్‌ అనే గేమ్‌లను రాజ్‌కోట్‌లో నిషేధిస్తూ పోలీస్‌ కమిషనర్‌ మనోజ్‌ అగర్వాల్‌ ఈ నెల 6న ఆదేశాలిచ్చారు. ఇకపై ఈ గేమ్‌లు ఆడేవారిని అరెస్టు చేయాలంటూ నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు ఈ ఆదేశాలను పంపారు. దీంతో గత మూడు రోజుల్లో ఈ గేమ్‌ ఆడుతూ పట్టుబడిన పది మందిని పోలీసులు అరెస్టు చేసి అనంతరం బెయిలు కూడా మంజూరు చేశారు. పిల్లలు, యువతలో ఆ ఆటలు హింసాత్మక స్వభావాన్ని అలవరుస్తున్నందున వాటిపై నిషేధం విధించడం తప్పనిసరైందని కమిషనర్‌ చెప్పారు. కాగా, ఈ ఆటలను అహ్మదాబాద్‌లోనూ నిషేధిస్తూ ఆ నగర పోలీస్‌ కమిషనర్‌ బుధవారమే ఆదేశాలిచ్చారు.

మరిన్ని వార్తలు