టీఎంసీ నేత దారుణ హత్య

5 Jun, 2019 16:18 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన సీసీ కెమెరాకు చిక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన తృణమూల్‌ నేత నిర్మల్‌ కుందూ మంగళవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో స్థానికంగా ఉన్న ఓ టీ కొట్టు దగ్గరకు వచ్చారు. టీ తాగుతూ స్థానికులతో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కాల్చి చంపారు. బైక్‌పై వెనుక కూర్చున్న వ్య‌క్తి అందరూ చూస్తుండగానే కుందూను కాల్చి చంపాడు. కాల్చిన వెంట‌నే బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు జ‌నం మ‌ధ్య నుంచి ప‌రార‌య్యారు. తీవ్రగాయాలైన కుందూను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. కాగా బీజేపీ నేత‌లే కుందూను హత్య చేశారని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ గురువారం కుందూ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత నుంచి బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మ‌ధ్య హింసాత్మ‌క దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇరు పార్టీలు తరచూ దాడులకు పాల్పడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో 42 స్ధానాలకు గాను బీజేపీ తొలిసారిగా 18 స్ధానాల్లో గెలుపొంది పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికల్లో 34 స్థానాల్లో గెలుపొందిన టీఎంసీ.. ఈ ఎన్నికల్లో 22 స్థానాలను మాత్రమే సాధించింది.

మరిన్ని వార్తలు