విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న దారుణం

17 Apr, 2019 13:56 IST|Sakshi

సాక్షి, విజయనగరం : డిగ్రీ యువతిపై ఓ యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన శృంగవరపుకోట మండలం శివరామరాజు పేట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. వేపాడు మండలం, ఆకుల సీతంపేట గ్రామానికి చేందిన జి. శిరీష డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం శిరీష శిమరామరాజు పేటలో ఉన్న తన మేనత్త ఇంటికి వచ్చింది. ఈ రోజు ఉదయం ఇంట్లో టీవీ చూస్తోన్న శిరీషపై హత్యాయత్నం జరిగింది.

శిరీష స్వగ్రామం ఆకుల సీతంపేట గ్రామానికి చెందిన బంగారు పుల్లయ్య అనే యువకుడు శిరీష తన మేనత్త ఇంటికి వెళ్లిందని తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం శిరీష ఇంట్లో టీవీ చూస్తుండగా.. హఠాత్తుగా అక్కడకు వచ్చిన పుల్లయ్య శిరీష వేసుకున్న చున్నీని ఆమె మెడకు గట్టిగా బిగించి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శిరీష ముక్కు నుంచి రక్తస్రావం జరిగి స్పృహతప్పి పడిపోయింది. దాంతో పుల్లయ్య అక్కడ నుంచి పరారయ్యాడు.

అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వచ్చి చూడగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న శిరీష వారికి కనిపించింది. తక్షణమే బాధితురాలిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆమెకు ప్రథమ చికిత్ప అందించారు. ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు పుల్లయ్య మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు