అన్నం పెట్టలేదని అంతం చేశాడు

26 Jul, 2018 13:14 IST|Sakshi
మంజుల మృతదేహం 

భార్యను సుత్తితో మోది చంపిన భర్త

కుటుంబ కలహాలే కారణం

పోలీసుల అదుపులో నిందితుడు

మెట్‌పల్లి(కోరుట్ల) : కుటుంబ కలహాలు ఓ వివాహిత ప్రాణాలను బలి తీసుకున్నాయి. కడదాకా తోడుంటానని ప్రమాణం చేసిన కట్టుకున్నడే అన్నంపెట్టలేదని ఆలిని కొట్టిఅర్ధంతరంగా కడతేర్చాడు. కన్నబిడ్డలకు తల్లి ప్రేమను అందకుండా చేశాడు. పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై శంకర్‌రావు కథనం ప్రకార.. నిర్మల్‌ జిల్లా బోథ్‌కు చెందిన కోసగంటి శ్రీనివాస్‌(40)కు అదే గ్రామానికి చెందిన మంజుల(35)తో ఇరవై ఏళ్లక్రితం వివాహం జరిగింది.

వండ్రంగి పని చేసే శ్రీనివాస్‌ ఆ తర్వాత ఏడాదికి భార్యతో కలిసి ఉపాధి నిమిత్తం మెట్‌పల్లికి వచ్చి స్థిరపడ్డాడు. వీరికి కుమార్తె శ్రావణి(19), కుమారుడు విఘ్నేష్‌(17) ఉన్నారు. కాగా దుబ్బవాడలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్న శ్రీనివాస్‌ దంపతులకు గత కొన్ని నెలల నుంచి తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఇంటికి మద్యం సేవించి వచ్చిన శ్రీనివాస్‌ భార్యను అన్నం పెట్టమని అడిగాడు.

దీనికి అమె నిరాకరించడంతో అగ్రహం చెంది ఇంట్లో ఉన్న సుత్తెతో తలపై గట్టిగా కొట్టాడు. తీవ్రంగా గాయం కావడంతో అమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుమార్తె, కుమారుడితో పాటు బంధువులు ఇంటికి వచ్చి మంజుల మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ శంకర్‌రావు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా నిందితుడు భార్యను చంపిన తర్వాత పోలీస్‌స్టేషన్లో లొంగిపోయాడు.

మరిన్ని వార్తలు