బంజారాహిల్స్‌లో దారుణం..

29 Jun, 2018 15:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని సంపన్న ప్రాంతం బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో యువతిపై బ్లేడ్లతో దాడి చేసి కిడ్నాప్‌ చేశారు. అత్యంత భద్రత ఉండే ఈ ప్రాంతంలో మూడురోజుల కిందట చోటుచేసుకున్న ఈ కిడ్నాప్‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన సమీరా ఆరు నెలల కిందట దుబాయ్‌ నుంచి వచ్చి నగరంలో ఉంటున్నారు. ఆమెకు పరిచయస్తుడైన ఫిరోజ్‌తో ఏవో గొడవలు అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిరోజ్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ కీర్తితో కలిసి మూడు రోజుల కిందట ఓ పబ్‌లో సమీరాపై దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆమెపై బ్లేడ్లతో దాడి చేసి.. కారులో అపహరించుకుపోయారు. ఆ తర్వాత కీర్తి నివాసంలోని బాత్రూమ్‌లో తననను బంధించి.. హింసించారని, ఒంటిపై దుస్తులు తీసేసి.. తనపై బ్లేడ్లతో దాడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన నుంచి నగదు, నగలను వారు దోచుకొని.. తనను హింసించారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనలో బాధితురాలు సమీరాకు తీవ్రంగా గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. బాధితురాలి ఒంటిపై, మెడపై బ్లేడ్‌తో చేసిన గాయాలున్నాయి. అయితే, బాధితురాలు వాదనను కూడా పూర్తిగా నమ్మలేమని, సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాతే ఈ కిడ్నాప్‌ ఉదంతం వెనుక నిజానిజాలు తెలిసే అవకాశముందని పోలీసులు అంటున్నారు.

మరిన్ని వార్తలు